ఇండియాలోనే టాప్ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి, గడచిన నెలలో తమ మిడ్-సైజ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాను విడుదల చేయడంతో కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.సెప్టెంబర్ 2021 నెలలో మారుతి సుజుకి మొత్తం దేశీయ విక్రయాలు 68,815 యూనిట్లుగా ఉంటే, సెప్టెంబర్ 2022 నెలలో అవి ఏకంగా 1,54,903 యూనిట్లకు పెరిగి, మొత్తం హోల్‌సేల్ విక్రయాలలో రెండు రెట్లు పెరుగుదలను నమోదు చేసింది.మినీ కార్లు అయిన ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్ల విక్రయాలు గతేడాది ఇదే నెలలో 14,936 యూనిట్లుగా నమోదైతే, సెప్టెంబర్ 2022 నెలలో ఇవి 29,574 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా అమ్మకాలు తగ్గినట్లు కంపెనీ పేర్కొంది.ఈ సమయంలో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో మరియు డిజైర్‌ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 20,891 యూనిట్ల నుండి 72,176 యూనిట్లకు పెరిగాయి.మరోవైపు, మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు సెప్టెంబర్ 2021లో 981 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 1,359 యూనిట్లకు పెరిగాయి.


కొత్తగా అప్‌గ్రేడ్ చేయబడిన 2022 మోడల్ మారుతి సుజుకి బ్రెజ్జా, ఎస్-క్రాస్ ఇంకా ఎర్టిగాతో కలిపి 18,459 యూనిట్ల నుండి 32,574 యూనిట్లకు పెరిగినట్లు మారుతి సుజుకి తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ ఎగుమతులు 17,565 యూనిట్ల నుంచి 21,403 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి కొన్ని వారాల క్రితమే తమ సరికొతత్ గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ధరలు రూ. 10.45 లక్షల నుండి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది ఈ విభాగంలో రారాజులుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీగా నిలుస్తుంది. మారుతి సుజుకి సంస్థకు చాలా కాలంగా ఈ విభాగంలో ఎలాంటి మోడల్ లేదు. అయితే, కొత్త గ్రాండ్ విటారా రాకతో, కంపెనీ ఇప్పుడు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి కూడా ఎంటర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: