కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్
చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. అతడిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నాంపల్లి వైద్యులు వెల్లడించారు. లోకో పైలట్ చంద్రశేఖర్ కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందని, పక్కటెముకలు, మూత్రపిండం దెబ్బతిన్నాయని కేర్ ఆసుపత్రి సూపరింటెండెంట్
డాక్టర్ సుష్మ తెలిపారు.
నిన్న జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం ఉదయం
డాక్టర్ సుష్మ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. క్షతగాత్రులు శేఖర్, బేలేశ్వరమ్మ, రాజ్కుమార్, మొహమ్మద్ ఇబ్రహీం, సాజిద్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మరికొంత క్షతగాత్రులను సోమవారమే డిచ్ఛార్జ్ చేసినట్లు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్తున్న ఎంఎంటీఎన్ రైలు, కర్నూలు నుంచి
సికింద్రాబాద్ వస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్
కాచిగూడ రైల్వేస్టేషన్ లో సోమవారం ఉదయం 10.40 నిమిషాల సమయంలో ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
కానీ ఎంఎంటీఎస్ రైలు లోకో పైలట్
చంద్రశేఖర్ రెండు రైళ్ల మధ్య ఇరుక్కొని తీవ్రంగా గాయపడ్డాడు. క్యాబిన్లో ఇరుక్కొని నరకయాతన అనుభవించిన చంద్రశేఖర్ 7 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత సోమవారం రాత్రి బయటకు తీసుకొచ్చారు. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించారు.
చంద్రశేఖర్ మొదటి నుంచి ఎంఎంటీఎస్ డ్రైవర్గానే విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంఎంటీఎస్ రైళ్లను నడపడంలో అతడికి పదేళ్ల అనుభవం ఉన్నట్లు తెలిపారు. హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెన్ ప్రధాన లైను నుంచి లూపు లైను ద్వారా 4వ ప్లాట్ఫాం వైపు వస్తుండగా ఎంఎంటీఎస్ రైలు
కాచిగూడ స్టేషన్ నుంచి ఫలక్నుమా వైపు వేగంగా వెళ్తూ ఢీకొట్టింది. ఈ ధాటికి ఎంఎంటీఎస్ రైలు ఆరు బోగీలు అమాంతం గాల్లోకి లేచి పట్టాలు తప్పాయి. ప్రమాదంపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఘటనలో స్టేషన్ మాస్టర్తో పాటు మరో ఆరుగురు ఉద్యోగుల స్టేట్మెంట్ రికార్డులు దర్యాప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. లోకో పైలట్
చంద్రశేఖర్ స్టేట్మెంట్ తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండానే ఎంఎంటీఎస్ ముందుకు వెళ్లిందని.. లోకో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.