ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో
అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో
హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా జరుగుతునే ఉన్నాయి. తమ సమస్యలను ఎందుకు పరిష్కరించరంటూ.. రెవెన్యూ సిబ్బందిని రైతులు, స్థానికులు నిలదీస్తున్నారు. కొందరైతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఏకంగా ఆత్మహత్య చేసుకుంటాం.. చంపేస్తామంటూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో అలాంటి తరహా ఘటనే జరిగింది. దీంతో రెవిన్యూ సిబ్బంది హడలెత్తిపోతున్నారు.
కర్నూలు జిల్లాలోని
ఆళ్లగడ్డ ఎమ్మార్వో ఆఫీసుకు, బత్తులూరుకు చెందిన
మహిళ తన భర్తతో కలిసి పురుగుల మందు,
పెట్రోల్ బాటిల్తో సహా వచ్చేసింది. తమ సమస్య పరిష్కారించకుండా.. రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ దంపతులు. తమ స్థలానికి సంబంధించిన సమస్యను పరిష్కరించమని ఎన్నోసార్లు కలిసి విజ్ఞప్తి చేశామని.. దాదాపు 10 ఏళ్లుగా తిరుగుతున్నా తమకు న్యాయం చేయలేదని వాపోయారు.
ఆ దంపతులు మాట్లాడుతూ.. మేము ఏళ్ల తరబడి ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా, పట్టించుకోవటం లేదని, తమకు న్యాయం జరగలేదని ఆ మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని తెలిపారు. భార్యాభర్తలు
పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బాతో రావడంతో ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది హడలిపోయారు. వెంటనే స్థానికులు కొందరు వారికి సర్థిచెప్పడంతో వ్యవహారం సద్ధుమణిగింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఎమ్మార్వో విజయా రెడ్డి
హత్య జరిగిన దగ్గరనుంచి రెవిన్యూ సిబ్బంది రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు. కానీ ఇలాంటి సంఘటన జరిగిన రెవెన్యూ సిబ్బందిలో మాత్రం లంచగొండితనాలు ఆగిపోలేదు. పేద ప్రజలను పీక్కుతింటున్నారు. ఏది ఏమైనా అధికారులు దీనిని సవాలుగా భావించి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో లంచం అనే మాట ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.