బెంజ్ కారు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. రిచ్ కార్లలో ఒకటి.. ఈ కంపెనీ ఇప్పటికే ఎన్నో కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటికి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. కాగా, ఈ తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ బుధవారం తన ఎస్యూవీ విభాగం లో 2021 జీఎల్సీ మోడల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.57.40 లక్షలుగా ఉండే ఈ కారు రెండు వేరియంట్ల లో లభిస్తుంది. జీఎల్సీ 200 పెట్రోల్ వేరియంట్ ధర రూ.57.40 లక్షలుండగా, జీఎల్సీ 200డి డీజిల్ వేరియంట్ ధర రూ. 63.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఈ కారు సరికొత్త ఫీచర్లతో వచ్చింది. ఆ కారు ప్రత్యేకతను పరిశీలిస్తే..అలెక్సా హోమ్, గూగుల్ హోమ్, 360 డిగ్రీ కెమెరా, నావిగేషన్ సిస్టమ్తో పాటు పార్కింగ్ లొకేషన్లు కనుకొనే ''మెర్సిడెస్ మీ కనెక్ట్'' అనే అధునాతన ఫీచర్లు కలిగిన యాప్ను పొందుపరిచారు. ముందు బెంజ్ కార్లలో వచ్చిన అన్ని ప్రత్యేకతలు ఈ కారులో కూడా ఉన్నాయని అంటున్నారు. డ్రైవింగ్ ను రిమోట్ సాయంతో కూడా ఆపరేట్ చేయవచ్చు అని అంటున్నారు.
రిమోట్ సాయంతో ఇంజిన్ను ప్రారంభించే సదుపాయం ఉంది. ఇందులో ఫ్రంట్ సీట్లను మసాజ్ ఫంక్షన్తో తయారు చేశారు. మెర్సిడెస్ బెంజ్ భారత ఉత్పత్తుల లైన్అప్లో ఈ తరహా సదుపాయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ''బెంజ్ ఎస్యూవీ విభాగం లో జీఎల్సీ మోడల్ మూలస్తంభంగా నిలిచింది. గతేడాది మా పోర్ట్ ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది అని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ ఈ సందర్బంగా తెలిపారు.. ఇప్పుడు మార్కెట్ లోకి విడుదల చేసిన కార్లు కూడా మంచి డిమాండ్ తో దూసుకుపోతున్నాయి.