హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో బండారు ద‌త్తాత్రేయ ప్ర‌తీ సంవ‌త్స‌రం నిర్వ‌హించే 'అల‌య్ బ‌ల‌య్ కార్యక్ర‌మం ఆదివారం ప్రారంభ‌మైంది. జ‌ల‌విహార్‌లో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆరంభం చేశారు. ఇందులో ముఖ్యంగా గిరిజ‌న నృత్యాలు, ఒగ్గుడోలు విన్యాసాలు, పెద్ద‌పులుల వేషాలు, కోలాటం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ఇదిలా ఉండ‌గా అల‌య్ బ‌ల‌య్ వ‌ద్ద ఒక ఊహించ‌ని సంఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మా అధ్య‌క్షుడు మంచు విష్ణు హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మాట్లాడేందుకు మంచు విష్ణు ప్ర‌య‌త్నం చేశారు. కానీ అక్క‌డ నుంచి ప‌వ‌న్ ప‌క్క‌కు వెళ్లారు. ఇటీవ‌ల మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం విధిత‌మే.

చిరంజీవి కుటుంబం మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌కాశ్‌రాజ్ మా ఎన్నిక‌లలో  ఓడిపోయారు.  అదేవిధంగా రెండు ప్యాన‌ల్స్ మెంబ‌ర్లు ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్రంగా దూష‌ణ‌లు చేసుకొని చిన్న‌పాటి యుద్ధంలా జ‌రిగింది. ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత మంచు విష్ణు త‌మ్ముడు మ‌నోజ్ బీమ్లానాయ‌క్ సెట్స్‌కు వెళ్లి ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించుకున్నారు. కానీ మంచు విష్ణును ప‌లుక‌రించేందుకు ప‌వ‌న్ ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ఆ వేదిక నుండి మంచు విష్ణు ఒక‌ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. చివ‌రిగా ఉన్న వ్య‌క్తి ఎవ‌రో గుర్తించండి అని క్యాప్ష‌న్ ఇచ్చాడు విష్ణు. అందులో ఉన్న‌ది ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కావ‌డం విశేషం.




 


మరింత సమాచారం తెలుసుకోండి: