చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడారు. తాను నిర్వహిస్తున్న రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కబడ్డీ టోర్నీ పోటీలను ఆమె ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నగరి డిగ్రీ కాలేజీలో కబడ్డీ పోటీలను రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా దంపతులు చెరొక జట్టు తరపున కబడ్డీ ఆడారు. టాస్‌ వేసిన రోజా.. ప్రత్యర్థి జట్టులోని సెల్వమణితో కబడ్డీ ఆడారు. చీర కొంగు ఎగ్గట్టి బరిలో దిగిన రోజా.. కబడ్డీ కబడ్డీ అని కూత పెడుతూ చాలా హుషారుగా ఆట ఆడారు. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. అలాగే ప్రత్యర్థి జట్టులోని రోజా భర్త సెల్వమణి కూడా కబడ్డీ కబడ్డీ అని కూత పెడుతూ ఆటను రక్తి కట్టించారు. రోజా దంపతుల కబడ్డీ ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఫైర్‌ బ్రాండ్‌, డైనమిక్‌ లేడీ లీడర్‌గా పేరున్న నగరి ఎమ్మెల్యే రోజా.. రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూ, విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. అంతేకాకుండా జబర్దస్త్‌ షోలో పంచ్‌ డైలాగులతో మోత మోగిస్తుంటారు. అలాంటి రోజా.. తమతో కలిసి సరదాగా కబడ్డీ ఆట ఆడటం నగరి డిగ్రీ కాలేజీ విద్యార్థుల్లో జోష్‌ నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: