కరోనా మహమ్మారి మరో సినీ నటుడికి సోకింది. దక్షిణ భారత దేశంలో మంచి పేరున్న సీనియర్ నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సమాజిక మాధ్యమ వేదికల ద్వారా తన అభిమానులకు తెలిపారు. మాతృభాష తమిళంలో ఆయన తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు తెలిపారు.
తాను వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలిందని ఆయన స్వయంగా తెలిపారు. కమల్ హాసన్ చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చేరారు. జ్వరం తో పాటు శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో కమల్ హాసన్ తమ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారని, ఆయనకు వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుహాస్ ప్రభాకర్ తెలిపారు. కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులిటన్ లో వెల్లడించింది. కమల్ హాసన్ అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గుతో బాధపడుతున్నారు. చికాగో తో పాటు పరిసర నగరాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గోనేందుకు ఆయన నవంబర్ 15వ తేదీ విదేశాలకు వెళ్లారు. విదేశాలకు వెళ్లక ముందే ఆయన తమిళనాడులో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు కూడా.
సమాచారం అందుకున్న తమిళ సినీ ప్రముఖులు హుటాహుటిన ఆసుపత్రి కి చేరుకోగా కమల్ హాసన్ వారితో సమావేశం అయ్యేందుకు నిరాకరించారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నందున తానెవరినీ కలుసుకో దల్చుకో లేదని కమల్ వారికి ఫోన్ లో సమాచారం అందించారు. కాగా కమల్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని ఆసుపత్రి సిబ్బంది అనధికారికంగా తమ సన్నిహితులకు తెలిపారు. కాగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా విడదల చేసిన హెల్త్ బులిటన్ స్పష్టం చేస్తోంది.