పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభ్యుల గందరగోళం మరో రోజు కూడా యధావిధిగానే సాగింది. ముఖ్యంగా రాజ్యసభలో నేడు కూడా వాయిదాల పర్వం... అదే పరంపర కొనసాగుతోండటం గమనార్హం. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సభ్యులు సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. పన్నెండు మంది ప్రతిపక్ష పార్లమెంట్ సబ్యులపై సభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్కు నిరసనగా సభలో నినాదాలు మారుమోగాయి. దాంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదావేశారు.
తిరిగి సభ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైనా అదే చిత్రం పునారావృతమైంది. దీంతో ఛైర్మన్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో సంప్రదాయాలు పాటించాలని, సభ గౌరవమర్యాదలకు భంగం కలిగించ వద్దని వేడుకున్నారు. అమర్యాదగా ప్రవర్తించడం, అన్యాయంగా వ్యవహరించడం అన్నివేళలా కుదరదని ఆయన హెచ్చరించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గ లేదు. దీంతో చేసేదేమీ లేక సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ మరలా ప్రారంభమైనా కూడా సభ్యుల తీరులో మార్పు లేదు. అంతా గందర గోళమే...