అందం, సొగసు పాతికల్లోనూ ఆపైనా కూడా కొనసాగాలంటే కాస్త శ్రద్ధ, కొన్ని మెలకువలు తప్పనిసరి అంటున్నారు బ్యూటిషన్లు నిపుణులు. పాలమీగడలాంటి నునుపైన చర్మానికి పైపై నగిషీలు ఎన్ని పెట్టినా సరిపోవు.. పోషకాహారమే దానికి మేలైన మార్గం. ఎన్ని పోషకాలు అందితే అంతగా చర్మం మెరిసిపోతుంది. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్ ఆహారానికి ఈ శక్తి ఉంది.
- శరీరంలో వ్యర్థాలు పేరుకొనేకొద్దీ క్రమంగా ముఖంలో కాంతి సన్నగిల్లుతుంది... అందుకే ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ అవసరం. ఉదయాన్నే కప్పు కొత్తిమీర, కప్పు పుదీనా, కప్పు కరివేపాకు తీసుకొని గ్రీన్చట్నీ చేసుకొని టిఫిన్కి జతగా తింటే బరువు తగ్గడంతో పాటు వ్యర్థాలు తొలగుతాయి.
- ఏ వయసు వారికయినా వృద్ధాప్య లక్షణాలు నివారించడానికి సన్స్క్రీన్ వాడకం తప్పనిసరి.. ముందుగా సన్స్క్రీన్ రాసుకొని ఆ తర్వాతే అలంకరణ వేసుకోవాలి.
- రోజంతా కాలుష్యపూరిత వాతావరణంలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అలానే నిద్రపోవడం కాకుండా... ముందుగా ముఖంపై పేరుకొన్న మురికిని తొలగించడానికి డీప్క్లెన్సర్తో శుభ్రం చేయాలి. రాత్రిళ్లు అయితే టోనర్ని రాసుకొని పడుకోవాలి. తెల్లారి ముఖం తాజాగా ఉంటుంది.
- పాదాలు, చేతులకు నిత్యం మాయిశ్చరైజర్ని రాయడం అలవాటు చేసుకోవాలి. చలికాలంలో ఇది తప్పనిసరి. అయితే మీరు వాడే మాయిశ్చరైజర్ తప్పనిసరిగా పోషకాలు నిండినదై ఉండాలి. కొబ్బరినూనె కూడా మేలైన మాయిశ్చరైజరే!
- తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల ముఖంలో టాన్ ఏర్పడుతుంది. దీని వల్ల ముఖంలో పిగ్మెంటేషన్ సమస్య తీవ్రమై క్రమంగా మచ్చలుగా మారతాయి. పండిన అరటిపండు, బొప్పాయి... ఏదయినా సరే.. ఆ పండు గుజ్జు తీసుకొని ఎండకి గురై నల్లగా మారిన ప్రాంతంలో పదినిమిషాల పాటు రుద్దితే టాన్ తొలగుతుంది.
-జుట్టు రాలిపోవడం, కళతప్పడం, పొడిబారడం జరుగుతుందంటే కారణం శరీరంలో థైరాయిడ్ సమస్యకానీ, ఆహారంలో ప్రొటీన్ల లోపం కానీ ఉన్నట్టు లెక్క. పోషకాహారం తీసుకొంటూనే గోరువెచ్చని నూనెతో తలకి మర్దన చేసుకొంటే మంచి ఫలితాలుంటాయి