మొటిమలు.. నేటి కాలంలో చాలా మందిని వేధించే సమస్య. టీనేజ్లోకి అడుగుపెట్టగానే చాలా మందికి ముఖంపై మొటిమలు, మచ్చల వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మారుస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లేక తెగ హైరానా పడుతుంటారు. మొటిమలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అసలు కారణం చాలా సాధారణంగా ఉంటుంది. వెంట్రుక కుదుళ్లలలో ఉండే తైల గ్రంధులు విస్తరించినప్పుడు అదనపు సిబం మరియు మృత చర్మకణాలు అడ్డుపడినప్పుడు మొటిమ అభివృద్ధి జరుగుతుంది.
అలాగే పర్యావరణ కాలుష్యం, సూర్యుడికి బహిర్గతం, సౌందర్య సాధనాల వినియోగం, అధిక ఒత్తిడి మరియు నీటిని తక్కువగా తీసుకోవడం సాధారణ కారణాలు.అంతేకాదు, కొన్ని ఆహార పదార్ధాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా మొటిమలు వస్తాయని అంటున్నారు నిపుణులు. అందులో ముందుగా చాక్లెట్. చాక్లెట్ ప్రియులకు ఇది చేదు వార్తే అయినా.. మొటిమలు తగ్గాలంటే చాక్లెట్ తినటం మానాలి. ఎందుకంటే.. చాక్లెట్ లో ఉండే కొవ్వు, చక్కెరలు మీ శరీరంపై మంటను కలిగించే సెబమ్ తైలాన్ని అధికంగా ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహిస్తాయి. దాంతో అది మొటిమలకు కారణం అవుతుంది.
అలాగే బంగాళ దుంప చిప్స్, ఫ్రాంచ్ ఫ్రైస్, బాగా వేయించిన ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా మొటిమలు ఏర్పడడానికి కారణాలు అవుతాయి. ఎందుకంటే.. ఇలాంటి ఆహార పదార్ధాలు ముందుగా చర్మంపై వాపును కలిగించటానికి కారణం అవుతాయి. క్రమంలో అది మొటిమలకు కారణం అవుతుంది. సో.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మొటిమలకు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా, జున్ను. ఇందులో ప్రొజెస్టెరాన్ సమృద్ధిగా ఉండుట వలన కొవ్వు ఉత్పత్తి గ్రంధులను అధిక మొత్తంలో పెంచుతుంది. దీనితో చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే జున్నును అధికంగా తీసుకోవడం కన్నా మోతాదులో తీసుకోవడం మంచిది.