* బుద్ధి జ్ఞానం ఉన్నోడితోనైతే మ‌నం మాట్లాడ‌వ‌చ్చు. కానీ.. వాడికి బుద్ధి జ్ఞాన‌మే లేన‌ప్పుడు వాడి గురించి మ‌నం ఏం మాట్లాడగలుగుతాం. క‌రోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టింది.. ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వ‌చ్చింది.. ఏం జ‌రిగింద‌ని అడిగితే చిన్న పిల్ల‌ల్ని..రెండో త‌ర‌గ‌తి పిల్లోడిని అడిగినా చెప్త‌డు. కానీ.. క‌రోనా వైర‌స్ సృష్టి క‌ర్త‌లు సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీ అని అంటే అంత‌కంటే ప‌నికిరాని ద‌ద్ద‌మ్మ ఈ ప్ర‌పంచంలో ఎవ‌డైనా ఉంట‌డా..* అంటూ కాంగ్రెస్ నేత‌పై తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి త‌ల‌సాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడే కార‌ణ‌మంటూ కాంగ్రెస్ నేత‌లు చేసిన కామెంట్స్ మీరేమంటార‌ని ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి త‌ల‌సాని ఘాటుగా స్పందించారు. పనికిరాని ద‌ద్ద‌మ్మ‌ల గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి సీఎం కేసీఆర్ అనేక చర్య‌లు తీసుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వం నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉంటోంద‌ని అన్నారు. 

 

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వాలె త‌ప్ప అన‌వ‌స‌ర‌మైన కామెంట్స్ ప‌నికిరాని కామెంట్స్ చేస్తున్నార‌ని మంత్రి త‌ల‌సాని మండిప‌డ్డారు. రాష్ట్రంలోని పేద‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా.. సీఎం కేసీఆర్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలిపారు. ఓ వైపు పేద‌లకు భ‌రోసా ఇస్తూనే మ‌రోవైపు క‌రోనా బాధితుల‌కు నాణ్య‌మైన వైద్య‌సేవలు అందిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో కోటిమందికి సాయం అందుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎవ‌రూ ఆక‌లితో ప‌స్తులుండాల్సిన ప‌నిలేద‌ని అన్నారు. ఇక నీళ్లు క‌రెంటు విష‌యంలో రాష్ట్రంలో ఎలాంటి లోటు లేద‌ని చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో బుద్ధిలేని ద‌ద్ద‌మ్మ‌లు కొంద‌రు త‌ప్పుడు కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: