భారత్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాలు ప్రకారం.. రోజువారీగా నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం గమనార్హం. గడచిన 24 గంట( బుధవారం సాయంత్రం 4గంటల వరకు)ల్లో కొత్తగా 773 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ కాగా 32 మంది మరణించారు. దేశవ్యాప్తంగా నేటి వరకు 5,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 402 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. కోవిడ్-19 బారినపడి 149 మంది చనిపోయారని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు వైద్య పరికరాలు అందిస్తున్నామని.. కరోనా హాట్స్పాట్లలో పర్యవేక్షణకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే.. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రజలందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
ఇక్కడే ఆయన మరో విషయాన్ని కూడా చెప్పారు. భారత దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల కొరత ఇప్పుడు గానీ భవిష్యత్తులోనూ ఉండబోదని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశంలో మాత్రల నిల్వలు సరిపడా ఉన్నాయని ఆయన తెలిపారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీ తర్వాత లాక్డౌన్ పొడిగించే విషయంపై ఇప్పటివరకు కేంద్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటరీ పక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్డౌన్పై ఆయన చర్చించారు. అయితే.. అయితే.. లాక్డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదని ఆయన చెప్పడం గమనార్హం. అయితే.. ఈ నెల 11న మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక అదే రోజు ఆయన లాక్డౌన్పై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.