తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్-19) నివారణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న వేళ ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడంపై తెలంగాణ ప్రభుత్వం తాజా నిషేధం విధించింది. రోడ్లు, సంస్థలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని ప్రభుత్వం హెచ్చరించింది. 'ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్-19 మహమ్మారి ప్రబలుతోంది. వ్యక్తిగత శుభ్రతతో పాటు బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి. అనారోగ్యకరమైన అలవాట్లను ప్రజలు మానుకోవాలి. ప్రజారోగ్యం, వైరస్లు, తదితర వ్యాధుల వ్యాప్తి, భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మడంపై ప్రభుత్వ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని' తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా కరోనాను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ వైపు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతూనే మరోవైపు కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యసేలు అందిస్తున్నారు. నిజానికి.. చైనాలో కరోనా ప్రతాపం చూపుతున్న సమయంలోనే తెలంగాణలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పారిశుధ్య పననులు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొంతమేరకు కరోనా అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. బుధవారం సాయంత్రం మంత్రి ఈటల రాజేందర్ విలేకరుల సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ రోజు కేవలం 49 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, ఇంకా 500కుపైగా మాత్రమే శాంపిల్స్ ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన 1100మందికి పరీక్షలు చేశామని ఆయన వెల్లడించారు. తెలంగాణకు 95శాతం కరోనా భయం తొలగిందని ఆయన తెలిపారు.