కరోనాతో యురోపియన్ దేశాలు విలవిలాడుతున్నాయి. రోజురోజుకూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజుకు వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఇలా.. అన్ని దేశాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు వేలు, లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యూరప్లో ప్రధానంగా సామాన్యుడి నుంచి మొదలు దేశాధినేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని జాన్సన్ కూడా కరోనా బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల స్పెయిన్ యువరాణి కూడా మరణించారు. ఇలా సామాన్యులేకాదు.. ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉన్నవాళ్లకు కరోనా సోకింది. ఏప్రిల్ 9వ తేదీ నాటికి యురోపియన్ దేశాల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.
స్పెయిన్: 1,48,220 కేసులు , ఇటలీ: 1,39,422 , జర్మనీ: 1,13,296 , ఫ్రాన్స్: 1,12,950, బెల్జియం: 23,403, స్విట్జర్లాండ్: 23,280, నెదర్లాండ్స్: 20,682, పోర్చుగల్: 13,141, ఆస్ట్రియా: 12,942, స్వీడన్: 8,419 కేసులు నమోదు అయ్యాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ను దాటింది. యూకేలో ఒక్కరోజే ఏకంగా 938మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడువేలకుపైగా చేరింది. స్పెయిన్లో 24గంటల్లో 757మంది మృతి చెందారు. అలాగే మరికొన్ని దేశాల్లో కూడా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు సుమారు 15లక్షల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇక మృతుల సంఖ్య సుమారు 90వేలకు చేరువలో ఉంది. ఇక అమెరికాలో మాత్రం పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. సుమారు నాలుగున్నరలక్షలమందికిపైగా కరోనా బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా పదివేలకుపైగా ఉంది.