ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి. కరోనా బారి నుంచి బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ మేరకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన విషయం ఏమిటంటే.. గత 12గంటల్లో రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. 217 శాంపిల్స్ కూడా నెగెటివ్ అని వచ్చేశాయి. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. సీఎం జగన్ తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నామని అధికారవర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు 58 ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. సొంతంగా టెస్టింగ్ కిట్లను కూడా తయారు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే ఏపీ ప్రజలు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే.. ఈక్రమంలోనే గత 12గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారవర్గాలు ఆనందపడుతున్నాయి.
అయితే.. బుధవారం రాత్రి అధికారవర్గాలు వెల్లడించిన వివరాల ఆధారంగా కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య మొత్తం 348కి చేరింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావరి ఒక్క కేసు నమోదైనట్టుగా తెలిపింది. ఈ రోజు ముగ్గురు కరోనా బాధితులు డిశ్చార్జ్ కావడంతో.. ఏపీలో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 9కి చేరింది. ఆ తర్వాత గత 12 గంటల్లో 217 శాంపిల్స్ను పరీక్షించగా.. అన్నీ కూడా నెగెటివ్ అని రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముందుముందు కూడా కరోనా వైరస్ వ్యాప్తిని మరింత వేగంగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి.