హదరాబాద్లోని ఎర్రగడ్డ ఆస్పత్రి మద్యంబాధితులతో నిండిపోతోంది. అదేమిటీ.. మద్యం బాధితులు ఎర్రగడ్డ ఆస్పత్రికి ఎందుకు వెళ్తున్నారని అనుకుంటున్నారా..? ఔను మీరు చదువుతున్నది నిజమే.. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్త నిరోధానికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్క నిత్యావసర సరుకులు అమ్మే షాపులు, మెడికల్ షాపులు మినహా మిగతా అన్ని షాపులూ బంద్ అయ్యాయి. దీంతో మద్యం ప్రియులకు కష్టాలు మొదలయ్యాయి. తాగేందుకు మద్యంలేక ఆగమాగం అవుతున్నారు. ఒకదశలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వారి ప్రవర్తనలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యంబాధితులను కుటుంబ సభ్యులు వెంటనే ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ ఆస్పత్రి మద్యంబాధితులతో నిండిపోతోంది. ఇప్పటివరకు మొత్తం 800 కేసులు నమోదు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమాశంకర్ తెలిపారు. ఇందులో 175మందిని అడ్మిట్ చేసుకున్నామని ఆయన తెలిపారు. ఇందులో చికిత్స అనంతరం సుమారు వందమందికిపైగా డిశ్చార్జ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిత్యం మద్యం తాగేవారు మానసిక వేదనకు గురవుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. నిజానికి.. వైన్స్షాపుల ముందు తెల్లవారు జాము నుంచే వచ్చి ఉండేవాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. షాపు తీసేంతవరకూ అక్కడే ఉండి మద్యం తాగిన తర్వాత పనికి వెళ్లే వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ రాష్ట్రంలో మద్యంబాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అప్పట్లో వారల్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం వీరికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.