ఈ బామ్మను గుర్తు పట్టారా..? అదే నండి కరోనా మహమ్మారిని ఎదురించి నిలబడిన ఇటలీ బామ్మ..! కన్నీటిసంద్రంలో ఉన్న ఇటలీకి ధైర్యాన్ని చెప్పి అమ్మ! కరోనాకు పిట్టల్లా జనం రాలిపోతున్న వేళ.. ప్రజలను కాపాడుకునేందుకు వైద్యులు రాత్రింబవళ్లు కష్టపడుతున్న సందర్భంలో ఆమె కరోనా నుంచి కోలుకుని సంచలనం సృష్టించారు. బామ్మ కోలుకోవడంతో ఇటలీ దేశస్తులే కాదు.. ప్రపంచ ప్రజల్లోనూ ఎంతో ఆత్మస్థైర్యం పెరిగింది. ఈ కరోనా తమను ఏమీ చేయలేదులే..అన్న ధైర్యాన్ని కల్పించింది. ఇటలీలో 104 సంవత్సరాల బామ్మ ఆదా జానుసీకి కరోనా సోకింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఉత్తర ఇటలీలోని మారియా గ్రాజియా ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. ఆమె ఎంతో ధైర్యంగా చికిత్సకు సహకరించారు. కరోనా సోకిందన్న భయంతో వణికిపోలేదు. ధైర్యంగా దానికి ఎదుర్కొని నిలబడ్డారు. కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన వేళ మానవాళి కళ్లలో ఆనందం కనిపించింది.
అయితే.. ఆస్పత్రి నుంచి కోలుకున్న బామ్మ.. ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నది. ఈ సందర్భంగా ఒక చిన్న సందేశం ప్రపంచ ప్రజలకు ఇచ్చింది. నేను క్షేమమే అని బయటి ప్రపంచానికి మీడియా ద్వారా చెప్పింది. ప్రస్తుతం పేపరు చదువుతూ, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నానని బామ్మ వెల్లడించింది. ఇంతకూ ఇదెలా సాధ్యమైందని పలువురు ప్రశ్నించగా.. బామ్మ చెప్పిన సమాధానంతో అందరినీ ఆశ్చర్యపర్చింది. ధైర్యం, దైవభక్తి తనను కాపాడాయని ఆమె పేర్కొంది. ఈ 104 ఏళ్లల్లో ఏ లక్షణాలైతే నన్ను నిలబెట్టాయో అవే ఇప్పుడూ కాపాడాయి అంటూ ఆనందం వ్యక్తం చేసింది బామ్మ. అందరూ ఇదే మార్గంలో ముందుకువెళ్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని చెప్పింది బామ్మ. నేడు ఈ బామ్మ ఇచ్చిన సందేశం ప్రపంచ ప్రజలకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తోందని చెప్పొచ్చు.