* కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టదు. టీకా వచ్చే వరకూ ఈ మహమ్మారి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం వ్యాక్సిన్ను తయారు చేసేదాకా మనతోనే ఉంటుంది. అంటే ఇంకా 12 నుంచి 18 నెలల సమయం పడుతుంది. ఇక దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి..? ఇందుకు రెండు మూడు మార్గాలే ఉన్నాయి. ఒకటి మనం సామాజిక దూరం పాటించడం, రెండోది పరీక్షలు చేయించడం. మూడోది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడం. ఈ రెండు మూడు మార్గాలే కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడుతాయి. వ్యాక్సిన్ వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాల్సిందే.* అని అమెరికాలోని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్కుమార్ ఝా వెల్లడించారు. అంతేగాకుండా.. కరోనాకు సంబంధించి మరికొన్నిఆసక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో భారత్ శక్తిసామర్థ్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
*అద్భుతమైన మేధోశక్తి భారత్ సొంతం. నిజానికి.. నమ్మశక్యం కాని ప్రతిభ భారత్లో ఉంది. స్థానికంగానే.. తక్కువ ఖర్చుతో నిర్ధారణ పరీక్షల సమాగ్రిని కూడా తయారు చేయగల శక్తిసామర్థ్యాలు భారత్కు ఉన్నాయి* అని ప్రొఫెసర్ అశిష్కుమార్ ఝా అన్నారు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. భారత్లో ఇప్పటికిప్పుడు లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఒకవేళ ఎత్తేసినా.. భారత్లో మళ్లీమళ్లీ లాక్డౌన్లు వస్తూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కానీ.. లాక్డౌన్లకు తొందరగా ముగింపు పలకాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంటే.. ప్రొఫెసర్ ఆశిష్కుమార్ ఝా చెబుతున్న విషయాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం సుమారు 12-18 నెలల వరకు ఉండడం ఖాయమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన మాటల్ని బట్టి భారత్లో మళ్లీ మళ్లీ లాక్డౌన్ వస్తూనే ఉంటాయన్నమాట.