కరనా వైరస్తో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్యుల నుంచి దేశాధినేతల వరకూ ఈ వైరస్ బారిన పడి విలవిలాడుతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్నివర్గాల వారినీ ఇది పట్టిపీడిస్తోంది. అగ్రరాజ్యాలను సైతం అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిని పడి మృతి చెందిన వారి సంఖ్య ఏకంగా 94వేలకు పైగా చేరుకుంది. ఇక దీని బారినపడిన వారి సంఖ్య 16లక్షలకుపైగా ఉంది. ఇందులో అమెరికాలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 4,64,845 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 16498మంది కరోనాతో మరణించారు. ఇక 25వేల మందికిపైగా కరోనా బారి నుంచి కోలుకున్నారు. స్పెయిన్లో లక్షన్నరకుపైగా మంది కరోనా బారినపడగా.. 15447 మంది మరణించారు. 52వేల మందికిపైగా కోలుకున్నారు.
ఇటలీలో లక్షన్నరకుపైగా మంది కరోనా బారిన పడగా.. 18279మంది మృతి చెందారు. ఇక సుమారు 50వేల మందికిపైగా కోలుకున్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ లక్షమంది వరకు కరోనా సోకగా, 12210మంది మృతి చెందినట్లు అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. ఇక యూకేలో సుమారు 8వేల మంది మరణించారు. ఆ తర్వాత జర్మనీ, ఇరాన్లో తదితర దేశాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. భారత్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6725 నమోదు అయ్యాయి. మరణించిన వారి సంఖ్య 226కు చేరుకుంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా సుమారు 1300కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 50మందికిపైగా మరణించారు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.