కోవిడ్-19 ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రతి ఇంటినీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 15, 77, 363 మంది ఈ వైరస్ బారినపడిన ప డగా, అందులో 93, 637 మరణాలు సంభవించాయి. చిన్నాపెద్దా, రాజు, పేద అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది కరోనా.
సౌదీ రాజ కుటుంబానికి కరోనా సోకింది. ఆ కుటుంబంలో మొత్తం 150 మంది వైరస్ బారిన పడినట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్టైమ్స్ వెల్లడించింది. రాజకుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి తమకు ఈ సమాచారం అందించారని తెలిపింది. అయితే వైరస్ సోకిన వ్యక్తుల పేర్లు మాత్రం వెల్లడించలేదు.
సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా చర్యగా రాజకుటుంబం, వారితో సన్నిహితంగా మెదిలే వారి కోసం ఇప్పటికే ఒక దవాఖానలో 500 పడకలను ఏర్పాటు చేశారు. దేశంలో కరోనా కేసులు రెండు లక్షల వరకు పెరగొచ్చని ఆరోగ్యశాఖ మంత్రి తౌఫిక్ అల్ రబియా అంచనా వేశారు. అక్కడ ఇప్పటి వరకు 2,932 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా , 41 మంది మరణించారు.