హైడ్రాక్సీక్లోరోక్విన్.. ఇప్పుడు ఏదేశం నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ఆయా దేశాల పౌరులను కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం కనిపిస్తున్న మందు ఇదొక్కటే. అందుకే ఈ మందుకు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ మందును ఎక్కువగా ఉత్పత్తి చేసేది భారత్ మాత్రమే కావడంతో అగ్రరాజ్యాలు సైతం భారత్ను వేడుకుంటున్నాయి. తమను కాపాడలంటూ ప్రధాని మోడీని అభ్యర్థిస్తున్నాయి. నిజానికి.. కరోనా వైరస్కు ఈ మందుతో చికిత్స చేయొచ్చునని ఫ్రెంచ్ సైంటిస్టు ప్రకటించడం.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి ప్రస్తావించడం, ఇది గేమ్ఛేంజర్గా ఉంటుందని భావించడంతో అన్ని దేశాలు కూడా దీని కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఎటు చూసిన ఆయా దేశాలకు భారతే కనిపిస్తుండడంతో ప్రధాని మోడీని వేడుకుంటున్నాయి.
నిజానికి.. మార్చి 25వ తేదీన అన్నరకాల డ్రగ్స్ ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలోనే తమ దేశానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను పంపించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేయడం.. భారత్ నుంచి స్పందన లేకపోవడంతో ఒకదశలో ట్రంప్ బెదిరింపులకు పాల్పడడం ఆ తర్వాత కొంతమేరకు సడలింపులు ఇవ్వడం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మిగతా దేశాలు కూడా ఈ మందు కోసం భారత్ ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు సమారు 30కిపైగా దేశాలు ఈ మందు కోసం భారత్ను వేడుకున్నాయి. అయితే.. ఇందులో మొదటి జాబితాలో కొన్ని దేశాలకు భారత్ ఈ మందును పంపింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం 13 దేశాల మొదటి జాబితాను భారత్ క్లియర్ చేసింది. ఇందులో యూఎస్ఏ, స్పెయిన్, జర్మనీ, బహ్రెయిన్, బ్రెజిల్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, సీషెల్స్, మారిషస్ & డొమినికన్ రిపబ్లిక్ ఉన్నాయి. మొత్తం 14 మిలియన్ టాబ్లెట్లను భారత్ పంపింది.