కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఏపీలో జగన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేయడంతో పాటు కట్టుదిట్టంగా నిబంధనలు అమలు అయ్యేలా చేస్తోంది. ఎవరైనా రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తుంటే పోలీసులు ఊరుకోవడం లేదు. ఇక రోజు రోజుకు కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఏపీ ప్రజల్లోనూ, అటు ప్రభుత్వంలోనూ నిన్నటి వరకు ఉన్న ధీమా అయితే సడలింది అనే చెప్పాలి. అటు కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇక నిన్న నిత్యావసరాల పంపిణీ సందర్భంగా నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ విధించారు.
కోవూరు నియోజకవర్గంలోనూ లాక్డౌన్ అమలు అయ్యింది. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారు. అయితే కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వారు అయినా లాక్ డౌన్ ఉల్లంఘించారన్న నిబంధనల నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.