కరోనా మహమ్మారిపై భారత్ అద్భుత విజయం సాధించింది. మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ ప్రాంతాన్ని వైరస్ రహిత ప్రాంతంగా మార్చింది. కరోనా ఫ్రీ హాట్స్పాట్గా మారిన మొదటి ప్రాంతం ఇస్లాంపూర్ కావడం గమనార్హం. ఇక్కడ పాజిటివ్ కేసు సంఖ్య పూర్తిగా పడిపోయి నిల్కు చేరుకోవడంతో కరోనా ఫ్రీ ప్రాంతంగా ఇస్లాంపూర్ను ప్రకటించారు. ఇది నిజంగా దేశానికి.. అందులోనూ కరోనాతో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రకు శుభవార్తేనని చెప్పొచ్చు. నిజానికి.. దేశంలో పాజిటివ్కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇప్పటివరకు మొత్తం 1666 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ముంబైలోనే ఏకంగా సుమారు వెయ్యిపాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో హాట్స్పాట్గా గుర్తించిన ఇస్లాంపూర్ను కరోనా ఫ్రీ ప్రాంతంగా ప్రకటించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఒక హాట్స్పాట్ను కరోనా ఫ్రీగా మార్చడం అంటే.. అంత సులభం ఏమీకాదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని మర్కజ్ జమాత్కు తర్వాతర ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా.. శుక్రవారం రాత్రి పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కూడా సుమారు 21మంది విదేశీయులను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారి ఎవరెవరితోకలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగుచూడడం వల్లే మహారాష్ట్రలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని విశ్లేషకులకు చెబుతున్నారు.