మహారాష్ట్రలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. కొత్తగా 92 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క ముంబైలోనే 72 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1666కు చేరుకుందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ఆందోళన కరమైన విషయం ఏమిటంటే.. కరోనా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు కూడా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటివరకు ఒక్క మహారాష్ట్రలో 90మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబైలోని హోక్హార్ట్ ఆస్పత్రిలో కూడా ఏకంగా 26మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారందరూ చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్యవర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అలాగే.. ఢిల్లీలో, మధ్యప్రదేశ్లో కూడా ఇటీవల పలువురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా రెండు రోజులు క్రితం ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రిలో చేరిన ముగ్గురు రోగులకు కరోనా సోకింది. అయితే.. వారికి చికిత్స అందించిన వైద్యుల నుంచి సోకడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంతో వైద్యవర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రోగులు వైద్యులను, వైద్యులు రోగులను నమ్మలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి వ్యాప్తి మాత్రం ఆగడం లేదని పలువురు అంటున్నారు. ఏదిఏమైనా.. ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిపై దే ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒక్క ఇటలీలోనే సుమారు 100మందికిపైగా మృతి చెందారు.