దేశ ప్ర‌జ‌ల ప్రాణాల‌తోపాటు ఆర్థిక వ్య‌వ‌స్థ‌నూ కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కోవిడ్ -19 ప్రభావం, పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌తో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్ర‌ధాని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3-4 వారాలు  చాలా కీలకమని న‌రేంద్ర‌మోడీ  పేర్కొన్నారు. 21 రోజుల లాక్‌ డౌన్  కాలంలో దేశంలో  కొన్ని అత్యవసర సేవలు తప్ప అన్ని ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేశామన్నారు. అయితే.. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మార్చి 24నాటి ప్ర‌సంగంలో మోడీ మాట్లాడుతూ.. బతికుంటే...ఆర్థికాన్ని త‌ర్వాత చూసుకోవ‌చ్చ‌ని అన్నారు. కానీ.. నేడు ముఖ్య‌మంత్రుల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జీవితం, ఆర్థికం రెండింటినీ కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 

 

అటు ప్రాణాలు, ఇటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని అని మోదీ చెప్పారు. ప్రాణాంతక వైరస్ నుంచి ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూనే అటు ఆర్థికవృద్ధిని దృష్టిలో పెట్టుకుని గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని ఆయ‌న‌ అభిప్రాయపడ్డారు. *మనం ఉంటేనే ప్రపంచం... అన్నది నిన్నటి మంత్రం.  మనం ఉండాలి, ప్రపంచమూ ఉండాలి... అనేది నేటి మంత్రం* అని మోడీ అన్నారు.  దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి ఇప్పటిదాకా తీసుకున్న చర్యల సత్ఫలితాలు కనిపించాలంటే, మరో మూడు నాలుగు వారాలు చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు.  వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి అందేలా మార్కెటింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాల‌ని సూచించారు. అలాగే.. ఆరోగ్య సేతు యాప్ ఇకనుంచి ట్రావెల్ ఈ పాస్ లాగా ఉపయోగపడుతుంద‌ని అన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది  పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల‌న్నారు. దేశంలో అవ‌స‌ర‌మైన మందులు అందుబాటులో ఉన్నాయ‌ని, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాల‌ని ఆయ‌న సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: