తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ప్రగతిభవన్లో శనివారం మధ్యాహ్నం 3గంటల నుంచి సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశం ఐదు గం టలకుపైగా జరిగింది. లాక్డౌన్ పొడిగింపు అంశంతోపాటు ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం వివరాలు వెల్లడించారు. ఇతర దేశాలనుంచి వచ్చిన 34 మందితోపాటు 25937 మంది క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. పాతవికొత్తవి కలుపుకుని శనివారం రాత్రి వరకు 503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇందులో 14మంది చనిపోయారని, 96 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. యాక్టివ్ కేసులు 393 ఉన్నాయని తెలిపారు.
మర్కజ్కు వెళ్లిన వచ్చిన సుమారు 1200మందిని గుర్తించి, క్వారంటైన్ చేశామని 1640మంది ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు 243 ఉన్నాయని, ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు అందరూ కోలుకుంటారని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఉత్పాతం రాకపోతే మనం చాలా వరకు బయటపడుతామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకే మనం చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు. ఒకవేళ పరిస్థితులు అదుపులోకి వస్తే.. దశలవారీగా లాక్డౌన్ ఎత్తేస్తామని ఆయన ప్రకటించారు.