దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజురోజుకూ పాటిజివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణాలు కూడా ఎక్కువగా నేమోదు అవుతున్నాయి.. ఈ క్రమంలో ఓ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. విమానయాన సంస్థలో మొదటి మరణం నమోదు అయింది. తమ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు కరోనా వైరస్ బారినపడి చెన్నైలో మృతి చెందినట్లు విమానయాన సంస్థ ఇండిగో శనివారం ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఇండిగో వెల్లగించకపోవడం గమనార్హం. 55 ఏళ్లకుపైగా వయసున్న అతడు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడట. నిజానికి.. అతడు శుక్రవారం నాడే చనిపోయాడని సమాచారం. 2006 నుంచి ఇండిగో సంస్థలో పనిచేస్తున్నాడని తెలిసింది. అయితే.. దేశంలో ఒక విమానయాన సంస్థలో ఉద్యోగి కరోనాతో చనిపోవడం ఇదే మొదటిసారి అని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఇప్పటికే 7529 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 242 మంది మరణించారు. ఇక 653 మంది కోలుకున్నట్లు అదికారవర్గాలు వెల్లడించాయి. అయితే.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ గడువు ఏప్రిల్ 14తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఆదివారం లేదా.. సోమవారం నాడు ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని, కీలక ప్రకటన చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. శనివారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోనూ అందరూ లాక్డౌన్ను పొడిగించాలని సూచించారు. మరోవైపు కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా ఇప్పటికే పంజాబ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఏప్రిల్ 30వరకు లాక్డౌన్ను పొడిగించాయి.