భార‌త్‌లో క‌రోనా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 8446 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో 288 మంది మ‌ర‌ణించారు. ఇక 653 మందికిపైగా కోలుకున్నారు. లాక్‌డౌన్ గ‌డువు ఏప్రిల్ 14 ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య‌మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌ధానంగా మూడు నాలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ‌గా న‌మోదు అవుతోంది. ఇందులో సుమారు 1700 పాజిటివ్ కేసుల‌తో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత సుమారు వెయ్యి కేసుల‌కు చేరువ‌లో ఢిల్లీ, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో న‌మోదు అవుతున్న మొత్తం కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల కేసులే దాదాపు 50శాతం ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అటు ప్ర‌జ‌ల్లో ఇటు ప్ర‌భుత్వాల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. 

 

ఈ విష‌యంలో ఆదివారం లేదా.. సోమ‌వారం నాడు ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతార‌ని, కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. శ‌నివారం ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనూ అంద‌రూ లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని సూచించారు. దీంతో లాక్‌డౌన్ పొడిగించేందుకే మోడీ మొగ్గుచూపుతార‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఇప్ప‌టికే పంజాబ్‌, ఒడిశా, క‌ర్ణాట‌క‌, తెలంగాణ ప్ర‌భుత్వాలు ఏప్రిల్ 30వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. శ‌నివారం రాత్రి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ‌లో ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. అంత‌కుముందు సుమారు నాలుగున్న‌ర గంట‌ల‌పాటు మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణ‌యం వెల్ల‌డించారు. ఇప్ప‌టికే పంజాబ్‌, ఒడిశా, క‌ర్నాట‌క, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను పొడిగించిన విష‌యం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: