కరోనా కారణంలో ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. అంతర్జాతీయంగా ప్రయాణ సర్వీసులు నిలిచిపోవడంతో భారతీయులు ఇతరదేశాల్లో, విదేశీయులు భారత్లోనే ఉండిపోయారు. భారత్లో ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోవడంతో విదేశీయులు ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో విదేశీయులను వారి సొంత దేశాలకు తరలించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ నుంచి ఆస్ట్రేలియా వాసులు సురక్షితంగా స్వదేశానికి బయలుదేరారు. 444 మంది ఆస్ట్రేలియా వాసులు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మెల్ బోర్న్కు వెళ్లారు. సిమన్ క్విన్ గ్రూప్ సౌజన్యంతో తమ పౌరులను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు భారత్ లోని ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాలో కూడా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇప్పటివరకు 6292 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 58మంది చనిపోగా.. 3141మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. కరోనా కట్టడికి ఆదేశం కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. అంతేగాకుండా.. కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో కొంత సానుకూల ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా. . ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా ఎనిమిదివేల మందికిపైగా మృతి చెందారు. సుమారు 18లక్షల మందివరకు కరోనా బారిన పడ్డారు. నాలుగు లక్షల మందికిపైగా కరోనా బారి నుంచి కోలుకున్నారు. అయితే.. అమెరికాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు సుమారు ఐదులక్షల మందికిపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే మరణాల సంఖ్యలో ఇటలీని దాటేసింది.