దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ పొడిగింపు విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 14 తర్వాత పొడిగించాలా..? వద్దా..? అన్న విషయంలో కేంద్రం ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఇదే సమయంలో పలు రాష్ట్రాలు మాత్రం కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా తమతమ రాష్ట్రాల్లో లాక్డౌన్ పొడిగించేశాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించాయి. ఇప్పటివరకు ఈ జాబితాలో ఆరు రాష్ట్రాలు చేరాయి. ముందుగా ఈ విషయంపై ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించినా.. సడలించినా.. ఆయా రాష్ట్రాల్లో మాత్రం లాక్డౌన్ కొనసాగుతుందన్నమాట. ఇదే దారిలో మరికొన్ని రాష్ట్రాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం.
ఇక ఇందులో సుమారు 1700 పాజిటివ్ కేసుల సంఖ్యతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కాగా, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8446 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 288 మంది మరణించారు. ఇక 653 మందికిపైగా కోలుకున్నారు. లాక్డౌన్ గడువు ఏప్రిల్ 14 దగ్గరపడుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్యమాత్రం తగ్గడం లేదు. ప్రధానంగా మూడు నాలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతోంది. ఇందులో సుమారు 1700 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత సుమారు వెయ్యి కేసులకు చేరువలో ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో నమోదు అవుతున్న మొత్తం కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల కేసులే దాదాపు 50శాతం ఉండడం గమనార్హం. దీంతో అటు ప్రజల్లో ఇటు ప్రభుత్వాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.