తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. వికారాబాద్ జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. వికారాబాద్ పట్టణానికి చెందిన కరోనా బాధితుడు(65) కరోనాతో శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతడు ఆస్పత్రిలో చేరేటప్పటికీ పరిస్థితి విషమంగా ఉంది. దమ్ము తీవ్రంగా ఉండటంతో వైద్యులు బాధితుడిని బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక వికారాబాద్ జిల్లాలో ఈ రోజు ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్ నమోదైనట్లు జిల్లా వైద్యార్థికారులు వెల్లడించారు. ఈ పరిణామాలతో జిల్లా వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వికారాబాద్ పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా.. శనినవారం రాత్రి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 503కు చేరుకుంది. విదేశాల నుంచి వచ్చిన 34 మందితోపాటు 25937 మంది క్వారంటైన్ నుంచి ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. శనివారం రాత్రి వరకు మొత్తం 503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 14మంది చనిపోయారు. 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 393 ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 243 కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తించారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123, మిగతా ప్రాంతాల్లో 120 కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్డౌన్ను సీఎం కేసీఆర్ పొడిగించిన విషయం తెలిసిందే. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలను గౌరవించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.