కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. యాత్రలకు వెళ్లివారు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. లాక్డౌన్ కంటే ముందు తెలుగురాష్ట్రాల నుంచి అనేకమంది యాత్రికులు ఉత్తరాది ఆలయాల సందర్శకు వెళ్లారు. ఈ క్రమంలో లాక్డౌన్ విధించడంతో అనేక మంత్రి యాత్రికులు వారణాసిలోనే ఉండిపోయారు.
దీంతో వారివారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎలా ఉంటున్నారోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు స్పందించి, వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో వారికి విముక్తి లభించింది. వారణాసిలో చిక్కుకుపోయిన తెలుగువారందరినీ ప్రత్యేక బస్సుల్లో అధికారులు తీసుకొస్తున్నారు. దీంతో సొంతూళ్లకు వస్తుండడంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి కష్టకాలంలో తమను ఆదుకున్న ప్రభుత్వాలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే.. వారందరినీ కూడా అధికారులు క్వారంటైన్లోనే ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.