హమ్మయ్య.. ఎట్టకేలకు తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు వస్తున్నారు. సోమవారం విశాఖ చేరుకోనున్నారు. నిజానికి.. ఇటలీలోని తెలుగు విద్యార్థులు మార్చి 15, 21వ తేదీల్లోనే ఢిల్లీకి వచ్చారు. అయితే.. అక్కడే అధికారులు వారిని అడ్డుకుని ప్రభుత్వ ఐటీబీపీ క్యాంపస్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇందులో మొత్తం ఏపీకి చెందిన 33మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో కొందరు విద్యార్థినులు కూడా ఉన్నారు. క్వారంటైన్ సమయంలో వీరికి రెండు సార్లు కోవిడ్-19 పరీక్షలు జరపగా నెగిటివ్గా తేలింది. దీంతో ఐటీబీపీ క్యాంపస్ అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేట్ బస్సులో ఏప్రిల్ 10న ఏపీకి బయలుదేరారు.
ఈక్రమంలో ఛత్తీస్గఢ్ అధికారులు వీరిని ఆపేశారు. అయితే.. తమవద్ద అన్ని ప్రతాలు ఉన్నాయని చూపించినా అధికారులు అనుమతించలేదు. అక్కడే అడ్డుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ ఆదివాసీ బాలికా విహార్లో వసతి కల్పించారు అధికారులు. ఈ విషయాన్ని విద్యార్థులు ఏపీ ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తం అయిన సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్ ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులు విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.