కరోనా వైరస్తో అగ్రరాజ్యం అమెరికా విలవిలాడుతోంది. ఇప్పటికే సుమారు ఆరు లక్షల మంది కరోనా వైరస్ బారిపడ్డారు. సుమారు 22వేల మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఎన్నో కలలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన లక్షల మంది భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ దేశంలోని యూనివర్సిటీలన్నీ మూతపడ్డాయి. ఇక హాస్టళ్ల నుంచి విద్యార్థులను వెళ్లగొడుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితుల్లో సుమారు 2.5లక్షల మంది భారతీయ విద్యార్థులు దిక్కతోచని, దారితెలియని స్థితిలో పడిపోయారు.
ఈక్రమంలో అక్కడి భారత రాయబారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. అయితే.. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు బాగా లేవని, మీ రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితులు కొంతమేరకు అదుపులోకి వచ్చాక సొంత దేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని భారత రాయబారి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఇప్పటికే అమెరికాలో సుమారు 50మందికిపైగా భారతీయులు కరోనాతో మరణించారు.