పసిడి ధర దేశవ్యాప్తంగా పైపైకి ఎగబాకుతోంది. 21 రోజుల లాక్డౌన్ కారణంగా కొనుగోళ్లు పడిపోయినప్పటికీ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సోమవారం బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్లలో రికార్డు స్థాయిని తాకాయి. ఒక శాతానికిపైగా పుంజుకుని రికార్డును స్థాయికి చేరాయి. ఎంసీఎక్స్ లో జూన్ పసిడి ఫ్యూచర్స్ 10 గ్రాములకు 45,800కు చేరుకుంది. మరోపక్క వెండి కూడా ఇదే బాటలో ఉంది.
మేనెల వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.4 శాతం పెరిగి 43,670కు చేరుకుంది. బంగారం ధరలు పెరిగే అవకాశం ఎ క్కువ కనిపిస్తోందని, మొత్తం ధోరణి సానుకూలంగా ఉందని ఎస్ఎంసీ గ్లోబల్ ఒక నోట్లో పేర్కొంది. బంగారానికి పది గ్రాముల ధర రూ. 45 వేల దగ్గర, వెండి కిలో ధర 42,500 రూపాయల వద్ద గట్టి మద్దతు ఉందని తెలిపింది.
గ్లోబల్ మార్కెట్లలో, ఈ రోజు బంగారం రేట్లు ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఒక నెల గరిష్ట స్థాయి వద్ద స్థిరంగా ఉన్నాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో గత వారం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన, తాజా ఉద్దీపన చర్యల మధ్య ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, బంగారానికి మద్దతు ఇస్తున్నాయని నిపుణుల అంచనా. స్పాట్ బంగారం ఔన్సు1,687 డాలర్లుగా వుంది. ఇతర విలువైన లోహాలలో, వెండి 0.5శాతం పెరిగి 15.40 డాలర్ల వద్ద,, ప్లాటినం 0.3శాతం క్షీణించి 745.74 డాలర్లకు చేరుకుంది.