కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన పేదలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ముందుగానేప్రకటించిన విధంగా వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే బియ్యం అందించిన ప్రభుత్వం మంగళవారం నుంచి రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి రూ. 1500 చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,112 కోట్ల నిధులను కేటాయించింది. వెంటనే ఈ మొత్తం రూ.1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం తెలిపారు.
ఈకార్యక్రమం కింద తెలంగాణలోని 74 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరించింది. మంగళవారం నుంచి నగదు బదిలీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు కూడా ఒక్కొక్కరికి 12కిలోల బియ్యంతోపాటు రూ.500ను ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సాయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.