జిల్లా అధికారులకు సమస్యలను విన్నవించేందకు ఆ ఎమ్మెల్యే వినూత్నంగా ఆలోచన చేశారు. ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టారు. ఒంటరిగా సైకిల్ ఎక్కి జిల్లా కేంద్రమైన ఏలూరుకు బయలుదేరారు. ఆక్వా రైతుల సమస్యలను పలుమార్లు విన్నవించినా... జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై నిరసన తెలుపుతూ నిమ్మల సైకిల్ యాత్ర చేపట్టారు.
తన నియోజకవర్గమైన పాలకొల్లు నుంచి సైకిల్ పై బయలుదేరి ఏలూరు కు వెళ్లి అక్కడ జిల్లా అధికారులను కలిసి ఆక్వా రైతుల సమస్యలను విన్నవించనున్నారు. ఆక్వా ఉత్తత్తులను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని, నీరు అందక పంట కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఎమ్మెల్యే సైకిల్ యాత్ర జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. లాక్డౌన్ అమలవుతున్ వేళ... ఎమ్మెల్యే సైకిల్పై యాత్ర చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఎమ్మెల్యే డిమాండ్లపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..