2014 ఎన్నికల టైం నుంచి బీజేపీతో విడిపోయే వరకు మోదీకి జై జై అన్న చంద్రబాబు గతేడాది ఎన్నికలకు ముందు మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీని, మోదీని చిత్తుగా ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి మళ్లీ మోదీకి జై కొడుతూ వస్తున్నారు. తాజాగా మోదీ మంగళవారం ఉదయం జరిగిన ప్రెస్మీట్లో లాక్డౌన్ పొడిగిస్తూ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానంటూ చెప్పారు. మోదీకి జై జై అన్నట్టుగా బాబోరి ప్రెస్మీట్ సాగింది. ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని అని.. లాక్డౌన్ పొడిగింపును సమర్థిస్తున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యమే అని చంద్రబాబు స్పష్టం చేశారు.
లాక్డౌన్ వల్ల కొంతవరకు కరోనాను కట్టడి చేస్తున్నామన్న చంద్రబాబు.. ఇది ఆర్థిక వ్యవస్థకు పెను విఘాతంగా మారిందని.. ఇదే సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడం కూడా చాలా ముఖ్యం అని చంద్రబాబు చెప్పారు. ఇక కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పలు సూచనలు కూడా ఆయన చేశారు. ఏదేమైనా చంద్రబాబు మోదీకి ఎదురు చెప్పే సాహసం ఎంత మాత్రం చేయడం లేదు. ఉదయం ఆయన ప్రెస్మీట్ అయ్యిందో లేదో వెంటనే ఆయన ప్రెస్మీట్ పెట్టి మోదీకి జై కొట్టారు.