కరోనా మహమ్మారి కట్టడికి జరుగుతున్న పోరులో భారత దేశానికి అనేక సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇందుకోసం పెద్దమొత్తంలో పీఎంకేర్స్కు విరాళాలు అందజేస్తున్నాయి. తాజాగా..ఈ జాబితాలో ఐసీఐసీఐ గ్రూప్ కూడా చేరింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ద్వారా సేవలందిస్తున్న ఐసీఐసీఐ గ్రూపు వంద కోట్ల రూపాయల విరాళాన్ని మంగళవారం ప్రకటించింది. ఇందులో రూ.80 కోట్లు పీఎంకేర్స్కు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలకు రూ.20 కోట్లు అందించనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రెసిడెంట్ సందీప్ బాత్రా తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరం కలసి కట్టుగా నిలబడి పోరాటాలని కోరుతున్నామని బాత్రా తెలిపారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తాము ఈ విరాళాన్ని అందిస్తున్నామని ఆయన చెప్పారు. కోవిడ్ -19 వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే 2.13 లక్షల సర్జికల్ మాస్కులు, 40వేలకు పైగా ఎన్95 మాస్కులు, 20వేల లీటర్ల శానిటైజర్లు, 16వేల గ్లౌజ్లు, 5300 వ్యక్తిగత రక్షణ సూట్లు (పీపీఈ), 2600 ప్రొటెక్టివ్ ఐ గేర్, 50 థర్మల్ స్కానర్లు, వెంటీలేటర్లను వివిధ ఆసుపత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అందించామని ఆయన తెలిపారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ముందున్న ప్రజలకు తమ సేవలను అందిస్తామని అన్నారు.