గత కొంత కొలాంగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  నటులు, రచయితలు, నిర్మాతలు, దర్శకులు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన ప్రముఖులు కన్నుమూయడం విషాదాన్ని నింపుతుంది.  తాజాగా ప్రముఖ సినీ, నవలా, నాటక రచయిత శ్రీ సి.ఎస్.రావు (85) నేడు హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.  సినీ రంగంలో ఆయన ఎన్నో చిత్రాలకు తన రచనతో కొత్త హంగులు తీసుకు వచ్చారు.  ఎన్టీఆర్  సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'సొమ్మొకడిది సోకొకడిది' వంటి చిత్రాల్లో ఆయన నటించారు.

 

మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, జాతీయ అవార్డు చిత్రం ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి ఎన్నో చిత్రాలకు  కథలు అందించారు. నాటక రంగానికి విశేషమైన సేవ చేసి ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. ఎందరో నటీనటులకి ఆచార్యులుగా కూడా వ్యవహరించారు.  ప్రస్తుతం సి.ఎస్.రావు చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు.

 

ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.. అయితే పెద్ద కుమారుడు ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. ఆయన రాలేని పరిస్థితి నెలకొంది. లాకౌట్ నియమాలను గౌరవించి ఎవ్వరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయవద్దని కుటుంబ సభ్యులు సినీపరిశ్రమ మిత్రులని, శ్రేయోభిలాషులని కోరారు. బుధవారం హైదరాబాదులోనే అంత్యక్రియలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: