దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1561 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 30మంది మరణించారు. తాజాగా.. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వారు ఎవరెవరిని కలిశారు..? వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, క్వారంటైన్కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల కూడా క్యాన్సర్ ఆస్పత్రిలో పలువురు వైద్యులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరి నుంచి క్యాన్సర్ పేషెంట్ల కూడా వైరస్ సోకడంతో అధికారులు షాక్ తిన్నారు. వెంటనే ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసింది. ఇక ఢిల్లీలో కంటైన్మనెంట్ జోన్ల సంఖ్య 55కు చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.