కరోనాతో ఆగమాగం అవుతున్న అమెరికన్లు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా అమెరికన్లు ఎక్కువగా యోగా వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితం అవుతున్న అమెరికన్లు ఆన్లైన్లో యోగా తరగతులు వింటున్నారు. నిత్యం యోగాసనాలు నేర్చుకుంటున్నారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ యోగా తరగతులకు అమెరికన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
ఇప్పటికే లక్షల సంఖ్యలో క్లాసులు వింటున్నారని అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ఈ విపత్కర పరిస్థితుల్లో మనలో ఆత్మస్థైర్యం పెంచుతుందని ఇప్పటికే పలుమార్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన విషయం తెలిసిందే. కరోనా ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి వైద్యనిపుణులు కూడా ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి ఆసనాలు వేయాలని సూచిస్తున్నారు.