కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించేలా చూస్తున్నారు. అయితే.. కొద్దిరోజులుగా మనం ఎక్కువగా కంటైన్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఒక కంటైన్మెంట్ ప్రాంతాన్ని ఎలా నిర్ణయిస్తారో తెలుసా..? కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ ప్రాంతంగా గుర్తిస్తారు. ఇక్కడ నిబంధనలు మరింత కఠినంగ ఉంటాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటారు. అవసరం అయితే.. నిత్యావసర సరుకులను కూడా ఇళ్లకే సరఫరా చేస్తారు. తాజాగా..తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏ ఒక్క ఇంట్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు బయటపడినా.. ఆ ఇంటి చుట్టూ ఉన్న 100 ఇళ్లతో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి మొత్తం ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ జోన్లోకి అన్ని మార్గాలు, రోడ్లు మూసేసి.. వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకే దారి ఏర్పాటు చేయాలని పేర్కొంది. అక్కడ 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఉండాలని ఆదేశించింది. అపార్ట్ మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో పాజిటివ్ కేసు బయటపడితే వాటి పరిధి వరకు మాత్రమే కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయొచ్చని స్పష్టం చేసింది. అంతేగాకుండా.. కేసుల సంఖ్యను బట్టి 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒకటి కంటే ఎక్కువ కేసులుంటే కనీసం 250 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్కు వెళ్లే అన్ని మార్గాలను సుమారు 8 అడుగుల ఎత్తున్న బారికేడ్లతో మూసేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.