ఏపీలో ఓ వైపు కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కరోనా మాత్రం కోరలు చాస్తూనే ఉంది. ఇదిలా ఉంటే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం కరోనా రూల్స్ పాటించడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. నిన్నటికి నిన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా బంధువులను క్వారంటైన్ నుంచి విడుదల చేసే విషయంలో ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రి మోపిదేవి వెంకటరమణకు మధ్య కాస్త చిన్న వార్ నడిచినట్టు వార్తలు వచ్చాయి. రెడ్ జోన్ ఉన్న చోట కూడా ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్టు తిరగడంతో పాటు తన బంధువులను క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని అడగడం ఎంత వరకు సమంజసం అని మంత్రి ప్రశ్నించినట్టు టాక్..?
ఇక ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సైతం ఆంధ్రా - కర్నాటక బోర్డర్లో నానా హల్చల్ చేశారు. ఆయన తన బంధువులను మొత్తం 39 మందిని ఐదు కార్లలో పెట్టుకుని ఏపీకి వస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్లు బెంగళూరు నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించే క్రమంలో బోర్డర్లోని చీలికబైలు చెక్పోస్టు దగ్గర పోలీసులు ఈ కాన్వాయ్ను ఆంధ్రాలోపలకు అనుమతించలేదు. దీంతో ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ తమను లోపలకు అనుమతించాలని నానా హల్చల్ చేశారు. ఏదేమైనా బాధ్యత కల ప్రజాప్రతినిధులే ఇలా చేయడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.