గుజరాత్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బద్రుద్దీన్, ఆయన భార్యకు కరోనా వైరస్ సోకడంతో ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడుతున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖెడేవాలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరోనా బారినపడడంతో అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వెంటనే ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు ఇంటి నుంచి పాలన కొనసాగించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.
కాగా, గుజరాత్లో కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ఒక్కరోజే 33 కొత్త కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు. అందులోనూ అహ్మదాబాద్లోనే అధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. వీరిలో 59మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే 350కిపైగా కేసులు ఉన్నాయి. గుజరాజ్ రాష్ట్రంలో నమోదు అవుతున్న మొత్తం పాజిటివ్ కేసుల్లో 50శాతం వరకు అహ్మదాబాద్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోందని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు.