భారత్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రధాని మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మే 3వరకు లాక్డౌన్ ను పొడిగించి, వివిధ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో మత ఆధారిత వివక్ష వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మతం ఆధారంగా రోగులను విడివిడిగా ఉంచుతున్నారని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ వెల్లడించింది. ఇదంతా గుజరాత్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరుగుతోందని అధికారులు చెప్పడం గమనార్హం. కరోనా బాధితులు, అనుమానితులైన హిందూ, ముస్లింలకు వేర్వేరుగా వార్డులు ఏర్పాటు చేసినట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గుణవంత్ హెచ్ రాథోడ్ తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయం ఆధారంగానే వీటిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ‘మామూలుగా ఆస్పత్రుల్లో మహిళలు, పురుష రోగులకు వేర్వేరుగా వార్డులు ఉంటాయి. కానీ ఇక్కడ.. హిందూ, ముస్లింలకు వేర్వేరుగా వార్డులు ఏర్పాటు చేశామ’ని డాక్టర్ రాథోడ్ చెప్పారు. ఇలా ఎందుకు విభజించారని ప్రశ్నించగా.. ‘ఇది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వాన్నే అడగండి’ అంటూ సమాధానం ఇచ్చారు. కాగా, అహ్మదాబాద్ ఆస్పత్రిలో 150 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉండగా వీరిలో 40 మంది వరకు ముస్లింలు ఉన్నట్టు సమాచారం.