గుజరాత్ ప్రజాప్రతినిధులు కొవిడ్-19తో వణికిపోతున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగుతోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన అధికారిక నివాసంలో నిర్వహించిన సమావేశానికి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడెవాలాతోపాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదెవాలా కలిసి మాట్లాడారు. అయితే.. మంగళవారం సాయంత్రం ఇమ్రాన్ ఖేడెవాలాకు పరీక్షలు చేయగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన ముఖ్యమంత్రి విజయ్రూపానీ సెల్ఫ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బద్రుద్దీన్, ఆయన భార్యకు కరోనా సోకడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా, వారం రోజుల పాటు ఇంటి నుంచే ముఖ్యమంత్రి పాలన కొనసాగించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా, గుజరాత్లో కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ఒక్కరోజే 33 కొత్త కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు. అందులోనూ అహ్మదాబాద్లోనే అధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. వీరిలో 59మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే 350కిపైగా కేసులు ఉన్నాయి. గుజరాజ్ రాష్ట్రంలో నమోదు అవుతున్న మొత్తం పాజిటివ్ కేసుల్లో 50శాతం వరకు అహ్మదాబాద్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోందని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు.