క్రికెట్ అభిమానులకు ఇది చేదువార్తే. కరోనా దెబ్బతో ఇప్పటికే అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ జాబితాలో ఐపీఎల్ టోర్నీ కూడా చేరింది. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2020 సీజన్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం అధికారికంగా వెల్లడించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, బోర్డు సెక్రటరీ జై షా, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్, బోర్డు ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఐపీఎల్పై సుధీర్ఘంగా చర్చించారు.
లీగ్ను వాయిదా వేస్తున్న విషయాన్ని బీసీసీఐ మంగళవారమే అన్ని ఫ్రాంఛైజీలకు, బ్రాడ్కాస్టర్లకు చెప్పింది. అయితే.. కరోనా మహమ్మారి నివారణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ టోర్నీని వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్-13వ సీజన్ మార్చి 29న ప్రారంభంకావాల్సి ఉంది. అయితే.. టీ20 వరల్డ్కప్ను ఐసీసీ, ఆస్ట్రేలియా రీషెడ్యూల్ చేస్తే ఈ ఏడాది సెప్టెంబర్-నవంబర్ మధ్య లీగ్ను నిర్వహించే వీలున్నట్లు తెలుస్తోంది. ఐతే రెండో విడుత లాక్డౌన్ ముగిసిన తర్వాతనే బీసీసీఐ లీగ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.