భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా..కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24గంటల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 1076 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11439కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు మొత్తం 377 మంది మరణించారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర 178 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. 1,305 మంది రోగులు కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2,687 కు చేరుకుంది.
ఆ తర్వాత తమిళనాడు (1,204), తెలంగాణ (624), రాజస్థాన్ (969), మధ్యప్రదేశ్ (730), గుజరాత్ (650) తదితర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలోని 600 కి పైగా ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. లక్షకు పైగా ఐసోలేషన్ పడకలు, 12,024 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) పడకలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 2.31 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. వీటిలో 18,644 పరీక్షలు ఐసిఎంఆర్ పరిధిలోని ల్యాబ్లలో జరిగాయని.. 2,991 పరీక్షలు ప్రైవేట్ ల్యాబ్లలో జరిగాయని వెల్లడించారు.