కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. అక్కడే చిక్కుకుపోయి.. స్వదేశానికి రాలేక.. చేతిలో డబ్బులు లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే విద్యార్థులు తమ కష్టాలను అమెరికాలో భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ‘ఆఫ్-క్యాంపస్ వర్క్ ఆథరైజేషన్' కొరకు దరఖాస్తు (ఫామ్ ఐ-20) చేసుకోవచ్చంటూ యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటన విడుదల చేసింది.
ఆన్-క్యాంపస్ ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం, వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఆఫ్-క్యాంపస్ వర్క్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని వెల్లడించింది. ఇందుకు పలు కండిషన్లు కూడా పెట్టింది. దరఖాస్తులపై వారు చదువుతున్న సంస్థల సంతకం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కోర్సు పూర్తయ్యే కాలంలో గరిష్ఠంగా ఏడాది కాలంపాటు ఆఫ్-క్యాంపస్ వర్క్ చేయవచ్చని తెలిపింది. ఈ నిర్ణయంపై భారతీయ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.